Wednesday, September 2, 2026

చర్ల నుంచి భద్రాచలం వరకు భారీ బైక్‌ ర్యాలీ

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ చర్ల మండల కన్వీనర్‌ దొడ్డి తాతారావు విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బుధవారం చర్ల నుంచి భద్రాచలం వరకు సుమారు 200 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపు మేరకు చేపట్టిన సమరభేరి కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గులాబీ జెండాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజులు గడిచినా హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రైతు భరోసా, కల్యాణలక్ష్మి, తులం బంగారం, ఆసరా పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, యువతకు ఉద్యోగాలు తదితర హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.