భద్రాచలం,ఆగస్ట్ 12: భద్రాచలంకు చెందిన ఆదివాసీ యువకుడు, డిపో యూత్ సభ్యుడు, మైనారిటీ గురుకుల పాఠశాలలో PETగా పనిచేస్తున్న చర్ప రాంబాబు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో భాగస్వామ్యమై అరుదైన ఘనత సాధించారు.
హైదరాబాద్లో 25 ఏప్రిల్ 2026న నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో మొత్తం 1,212 మంది పాల్గొనగా, విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, జె.ఆర్. ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైంది. ఈ కార్యక్రమంలో చర్ప రాంబాబు కూడా పాల్గొని ఈ ప్రతిష్ఠాత్మక రికార్డులో భాగస్వామి అయ్యారు.
ఈ సందర్భంగా డిపో యూత్ ఆధ్వర్యంలో చర్ప రాంబాబును శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేసి ఘనంగా అభినందించారు. ఆదివాసీ యువకుడిగా తన ప్రతిభను క్రీడా రంగంలో చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
చర్ప రాంబాబు సాధించిన ఈ విజయం భద్రాచలం ప్రాంత యువతకు, ముఖ్యంగా ఆదివాసీ యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో క్రీడలు మరియు ఇతర రంగాల్లో ముందుకు సాగితే యువత అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ ప్రతిభను చాటుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సంతోష్, టీయుడబ్ల్యూజె భద్రాచలం పట్టణ అధ్యక్షుడు విజ్జగిరి రాజా కిరణ్, డిపో యూత్ సభ్యులు పండా అమృతరావు (అంబు), తాళ్ళ నాగరాజు, శీలం నాగరాజు, తాళ్ళ శివ, కారం రవితేజ, డిపో సత్తి, ప్రసాద్ తదితరులు పాల్గొని చర్ప రాంబాబుకు అభినందనలు తెలిపారు.



No comments:
Post a Comment
Thanks for your visit and comment.